సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నో
  • ఎనిమిది నెలలుగా జైలులోనే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి
  • రూ.338 కోట్ల నగదు బదిలీకి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న అపెక్స్ కోర్టు   
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారుచేశారని మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు దీనిని పక్కన పెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

Manish Sisodia
Delhi Liquor Scam
AAP
Supreme Court
No Bail
Bail petition
Rejected

More Telugu News