చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్.. మాజీ ప్రియుడే చంపేశాడా?

Champapet woman Murder case
  • ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
  • ఇటీవలే ప్రేమ్ కుమార్ తో స్వప్నకు వివాహం
  • మాజీ ప్రియుడితో కాంటాక్ట్ లో ఉన్న స్వప్న
చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హత్యకు గురైన యువతి పేరు స్వప్న అని, ఇటీవలే ఆమెకు ప్రేమ్ కుమార్ అనే యువకుడితో వివాహం జరిగిందని చెప్పారు. గతంలో సతీశ్ అనే యువకుడిని స్వప్న ప్రేమించిందని, పెళ్లి తర్వాత కూడా అతడితో కాంటాక్ట్ లో ఉండడమే గొడవలకు దారితీసిందని, మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడని తెలిపారు. స్వప్న భర్త ప్రేమ్ ను బిల్డింగ్ పై నుంచి తోసి పారిపోయాడని వివరించారు. స్వప్న తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.

తొలుత ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాక స్వప్న హత్యకు గురైందని నిర్ధారణకు వచ్చారు. స్వప్న, ప్రేమ్ కుమార్ ఉంటున్న గదిని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హత్యకు ఉపయోగించిన కత్తి లభించిందని సమాచారం. కాగా, శనివారం ఉదయం స్వప్న హత్య జరిగిన సమయంలో గదిలో ఆమెతో పాటు ప్రేమ్ కుమార్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అదే సమయంలో సతీశ్ తన మిత్రులతో కలిసి వచ్చి వారితో గొడవ పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వప్నను చంపేసి, ప్రేమ్ ను బంగ్లా పై నుంచి తోసేసి పారిపోయారని అంటున్నారు. ఇద్దరు యువకులు పారిపోతుండడం చూశామని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మరోవైపు, తన కూతురును ఎవరు చంపారు.. ఎందుకు చంపారో తెలియదని స్వప్న తండ్రి మోహన్ మీడియాకు తెలిపారు. పోలీసులు చెప్పాకే స్వప్న హత్య గురించి తనకు తెలిసిందని వివరించారు.
Go Back to Shorts
Champapet
Hyderabad
woman murder
Ex lover
Crime News

More Telugu News