Australia: కివీస్‌ను ఓడించినా నాలుగో స్థానంలోనే ఆస్ట్రేలియా.. అద్భుతం జరిగితే తప్ప సెమీస్‌కు ఆ నాలుగు జట్లే ఫైనల్!

  • ఆసీస్‌పై ఓడినా నెట్‌రన్‌రేట్ కాపాడుకున్న కివీస్
  • తొలి రెండు స్థానాల్లో సౌతాఫ్రికా, ఇండియా
  • మిణుకుమిణుకు మంటున్న ఇంగ్లండ్ ఆశలు
  • నేడు భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్
  • పాకిస్థాన్ కథ ముగిసినట్టే
  NZ stay above Australia despite loss

ధర్మశాలలో గతరాత్రి న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు అసలైన మజా పంచింది. బంతి బంతికి ఉత్కంఠ పంచిన ఈ మ్యాచ్‌లో చివరికి ఆస్ట్రేలియా విజయం సాధించింది. కివీస్‌పై బ్రహ్మాండమైన విజయం సాధించినప్పటికీ ఆసీస్ మాత్రం నాలుగో స్థానానికే పరిమితమైంది. కారణం నెట్‌రన్‌రేటే. 

ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ దాదాపు గెలిచినంత పనిచేసి చివరికి ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ కిందకు పడిపోకుండా ఇదే కాపాడింది. ఓడినా నెట్‌రన్ బలంగా ఉండడంతో యథాస్థానంలోనే ఉంది. ఆస్ట్రేలియా ఖాతాలోనూ నాలుగు విజయాలు, 8 పాయింట్లు ఉన్నప్పటికీ కివీస్‌తో పోలిస్తే నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండడంతో నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

 ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్ల ఖాతాలోనూ చెరో 10 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్ పరంగా సఫారీ జట్టు మెరుగైన స్థితిలో ఉండడమే ఇందుకు కారణం. ఇక డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లండ్ వరుసగా నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిన పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా, అట్టడుగున ఉన్న ఇంగ్లండ్‌కు మాత్రం అవకాశాలు ఇంకా మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. 

ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్ తర్వాతి నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే నాకౌట్ రేసులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే, అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లండ్ నేడు అజేయమైన భారత జట్టును ఎదుర్కొంటుండగా, ఆ తర్వాతి మ్యాచుల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సంచలనాలు జరిగితే తప్ప ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News