ఒకే కులానికి చెందిన వాళ్లు నాపై దాడికి యత్నించారు: అంబటి రాంబాబు

ఖమ్మంలో తనకు నిరసన సెగ తగిలిందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇదంతా అసత్య ప్రచారమేనని అన్నారు. ఖమ్మంలో తనకు నిరసన సెగ తగలలేదని, కొందరు టీడీపీ వాళ్లు తనపై దాడికి యత్నించారని చెప్పారు. వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఒకే కులానికి చెందిన వాళ్లు దాడికి యత్నించారని చెప్పారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే దాడికి యత్నించారని మండిపడ్డారు. ఇలాంటి కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.  

నిన్న తన కారుపై గోధుమల బస్తాలు పడ్డాయని, ఈరోజు ఏకంగా దాడికే యత్నించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని... ఇలాంటి ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కార్తీక వనభోజనాల సమయంలో తనను చంపేసిన వారికి రూ. 50 లక్షలు ఇస్తామని ప్రకటించారని... ఆ రోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. కులోన్మాదంతోనే వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడపై దాడి చేశారని అన్నారు. చంద్రబాబుపై ప్రేమ ఉంటే మరో రూపంలో చూపించుకోవాలని... ఇలా తమపై దాడికి పాల్పడటం సరికాదని చెప్పారు. తనకు కూడా ఒక కులం ఉందనేది తనపై దాడి చేసిన వారు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

ambati Rambabu
Khammam
YSRCP
Telugudesam

More Telugu News