KTR: రైతుబంధు ఆపేయమంటారా? మీకు గుణపాఠం తప్పదు: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

  • ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతు బంధు నిలిపేయాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ
  • కాంగ్రెస్ రైతు విరోధి అని మరోసారి తేలిపోయిందని కేటీఆర్ ఆగ్రహం
  • రైతు బంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అన్న కేటీఆర్
Minister KTR fires at Congress over Rythu Bandhu issue

పంట పెట్టుబడికి సాయంగా అందిస్తోన్న రైతుబంధును ఆపేయాలంటూ ఈసీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని, ఇది ఈ పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయడం పక్కా అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మళ్లీ రుజువైపోయిందన్నారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధును నిలిపివేయాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే సీఈసీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న ఓ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్ ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇంటింటికి మంచినీళ్లు.. ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటారేమో?..
అందులో కూడా కేసీఆరే కనిపిస్తాడు కదా?.
కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.
పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు.
రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు.
తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ సుదీర్ఘ ట్వీట్ చేశారు.

More Telugu News