ఆధారాలు ఇస్తే కెనడా దర్యాప్తునకు సహకరిస్తాం: జైశంకర్
- ఖలిస్థాన్ నేత హత్యకు ఆధారాలు ఉంటే పంచుకోవాలన్న జైశంకర్
- భారత్ తప్పకుండా పరిశీలిస్తుందని స్పష్టీకరణ
- రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రశక్తులకు మద్దతుగా నిలవొద్దని హితవు
‘‘ఇది భారత ప్రభుత్వ విధానం కాదని కెనడియన్లకు చెప్పాం. మీ వద్ద ఏదైనా నిర్దేశిత సమాచారం ఉంటే అది మాకు తెలియజేయండి. దాన్ని పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని ‘ఫైవ్ ఐస్’ దేశాల మధ్య పంచుకోవడంపై ప్రశ్న ఎదురు కాగా.. తాను ఫైవ్ ఐస్ లేదా ఎఫ్ బీఐలో భాగం కాదన్నారు. ఈ ప్రశ్నకు స్పందించడానికి తాను సరైన వ్యక్తిని కాదన్నారు. ఫైవ్ ఐస్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ తో కూడిన ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి.
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలకు ఫైవ్ ఐస్ భాగస్వాముల మధ్య ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం ఆధారంగా ఉన్నట్టు కెనడాలోని యూఎస్ రాయబారి డేవిడ్ కోహెన్ లోగడ తెలిపారు. దీంతో జైశంకర్ స్పందిస్తూ.. వ్యవస్థీకృత నేరాలు, వేర్పాటు వాద శక్తులు, హింసను రాజకీయ అవకాశ వాదంతో కెనడాలో అనుమతిస్తున్నట్టు విమర్శించారు.