Chandrababu: చంద్రబాబును 33 ప్రశ్నలు అడిగి ఆధారం చూపించలేకపోయారు: ములాఖత్ తర్వాత అచ్చెన్నాయుడు

  • చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న అచ్చెన్నాయుడు
  • సంబంధం లేని ప్రశ్నలు అడిగారని విమర్శ
  • చంద్రబాబుకు మద్దతుగా వస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని వ్యాఖ్య
  • జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారన్న అచ్చెన్నాయుడు
Atchannaidu says chandrababu faces 33 questions from cid

చంద్రబాబును రెండురోజుల పాటు విచారించిన సీఐడీ అధికారులు 33 ప్రశ్నలు వేసి, కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పనికిమాలిన, సంబంధం లేని ప్రశ్నలు వేశారని, రెండురోజుల పాటు ఆయనను ఇబ్బంది పెట్టారన్నారు.

చంద్రబాబును విచారించిన సీఐడీకి ఒక్క ప్రశ్నలోను అనుమానం కనిపించలేదన్నారు. తమ పార్టీ అధినేతను జైల్లోనే ఉంచేందుకు కేసు మీద కేసు వేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఆయన ధైర్యంగా ఉన్నారని, ధైర్యంగా పోరాడాలని తమకు సూచన చేశారన్నారు. జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేసి ముందుకు సాగాలని చెప్పారన్నారు. చంద్రబాబు అవినీతి అని చెప్పడమే తప్ప ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. డబ్బులు వచ్చాయని, అక్రమాలు చేశారని చెప్పేందుకు ఆధారాలు లేవన్నారు. ప్రాథమిక ఆధారాలు లేవని, అరెస్టైన తర్వాత ఇప్పుడు ఆధారాలు సేకరిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు వెళ్లినట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించిందా? అన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా బయటకు వచ్చిన వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారన్నారు. 70 దేశాల్లోని ఉద్యోగులు తమ పార్టీ అధినేత అరెస్టును ఖండించారన్నారు. జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని, పోరాటపటిమతో ఉన్నారన్నారు. ఆయన సలహాలు, సూచనలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. పరిశుద్ధత బాగా లేదని, దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సీబీఐ విచారణ కోరడంపై స్పందిస్తూ... ఆధారాలు లేనప్పుడు ఏ విచారణ అయినా ఇబ్బంది లేదన్నారు.

More Telugu News