రైలులో యూపీ మహిళా పోలీసుపై దాడి చేసిన దుండగుడు ఎన్కౌంటర్లో హతం
- సరయు ఎక్స్ప్రెస్లో సీటు విషయంలో మహిళా కానిస్టేబుల్, నిందితులకు మధ్య గొడవ
- దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన నిందితులు
- ఆగస్టు 30న ఘటన
- ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు అనీశ్ హతం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్లో సరయు ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో రక్తపు మడుగులో పడివున్న మహిళా కానిస్టేబుల్ను పోలీసులు గుర్తించారు. నిందితులు పదునైన ఆయుధంతో ముఖంపై దాడిచేశారు. దాడిలో ఆమె పుర్రె ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
సీటు విషయంలో నిందితులు, మహిళా కానిస్టేబుల్కు మధ్య రైలులో గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. గొడవ మరింత పెరగడంతో కానిస్టేబుల్పై నిందితులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. రైలు అయోధ్యకు చేరుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ ఉదయం తారసపడిన నిందితులు కాల్పులు ప్రారంభించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో అనీశ్ హతమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.