ఉప్పల్‌లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌: పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

  • ఈ నెల 29న ఖాళీ స్టేడియంలో జరగనున్న 
    పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ 
  • 28న గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ నేపథ్యంలో భద్రత ఇవ్వలేమన్న పోలీసులు
  • ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ నిర్వహించాలని అధికారుల నిర్ణయం
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. కానీ, భారత్ ఆడే మ్యాచుల్లో ఒక్కటి కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. ఈ విషయంలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న భాగ్యనగర క్రికెట్‌ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం, బీసీసీఐ మరో చేదు వార్త చెప్పాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ పోరు ఖాళీ స్టేడియంలో జరగనుంది. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ -ఉన్ -నబీ పండగ ఉండటంతో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు స్పష్టం చేశారు. 

ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలిపిన హెచ్‌సీఏ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి బీసీసీఐ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.  ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. కాగా, అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్‌ వార్మప్‌తో పాటు మూడు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ మధ్యన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ODI World Cup
Hyderabad
uppal stadium
Pakistan
newzeland
match
Team India
BCCI

More Telugu News