Eatala Rajendar: తెలంగాణలో పేదలు రెండే రెండు కోరుకుంటారు: ఈటల

  • సీఎం కేసీఆర్ పై ఈటల విమర్శలు
  • రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లయింది... డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవన్న ఈటల
  • పేదల కళ్లలో మట్టి కొట్టారంటూ ఆగ్రహం
Eatala take a dig at CM KCR

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవని ప్రశ్నించారు. పేద ప్రజలకు సొంతింటి కల తీర్చకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కళ్లలో మట్టి కొట్టిందని విమర్శించారు. తెలంగాణలో పేదలు కోరుకునేవి రెండే రెండు అని, ఒకటి సొంత ఇల్లు, రెండు తాము చనిపోతే పూడ్చడానికి కొంచెం స్థలం అని ఈటల వివరించారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఏంచేస్తున్నారని నిలదీశారు.

ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకున రంగారెడ్డి జిల్లా సురంగల్ గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, వికలాంగులకు, వృద్ధులకు ఆరోగ్య ఉపకరణాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 3.50 కోట్ల ఇళ్లు, పొరుగు రాష్ట్రం ఏపీలో 20 లక్షల ఇళ్లు కట్టించినట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ రైతులకు రూ.5 వేల రైతుబంధు ఇచ్చి, మిగతా పథకాలను మర్చిపోయాడని ఈటల విమర్శించారు.

More Telugu News