Mahesh Babu: మేనల్లుడికి అభినందనలు తెలిపిన మహేశ్ బాబు

  • దుబాయ్ లో ఘనంగా సైమా ఉత్సవాలు
  • బెస్ట్ డెబటెంట్ నటుడిగా అశోక్ గల్లా
  • 'హీరో' చిత్రంలో నటనకు గాను సైమా పురస్కారం
Mahesh Babu congratulates Ashok Galla

సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. టాలీవుడ్ లో చాలామంది నటీనటులకు సైమా అవార్డులు దక్కాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్-పద్మావతి దంపతుల తనయుడు) సైమా వేడుకలో ఉత్తమ డెబ్యూ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 'హీరో' చిత్రంలోని నటనకు గాను అశోక్ గల్లా సైమా పురస్కారానికి ఎంపికయయ్యాడు.

తన సోదరి కుమారుడు తొలి చిత్రంతోనే అవార్డు గెలుచుకోవడం పట్ల మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. మేనల్లుడ్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సైమా అవార్డ్స్-2023లో బెస్ట్ డెబటెంట్ యాక్టర్ గా నిలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ మహేశ్ ఎక్స్ లో స్పందించారు. ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

దీనిపై అశోక్ గల్లా వినమ్రంగా స్పందించాడు. థాంక్స్ మహేశ్ మామయ్యా అంటూ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ అభినందనలు, ప్రోత్సాహకరమైన మాటలు విన్న తర్వాత నా చేతుల్లో ఉన్న సైమా అవార్డు మరింత ఉజ్వలంగా కాంతులు విరజిమ్ముతోందని అశోక్ గల్లా పేర్కొన్నాడు. 

అశోక్ గల్లా 'హీరో' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా 2022 జనవరిలో విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై గల్లా జయదేవ్ కుటుంబమే ఈ చిత్రాన్ని నిర్మించింది.

More Telugu News