మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు

Female IAS officer lodges complaint against man who persistently following her against her wishes
  • సికింద్రాబాద్‌లోని ఓ ప్రభుత్వ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఐఏఎస్
  • ఆమెను కలిసేందుకు నిందితుడు పలుమార్లు కార్యాలయానికి వచ్చిన వైనం
  • తాను పెద్ద అభిమానినని, సోషల్ మీడియాలోనూ ఐఏఎస్‌ను ఫాలో అవుతుంటానని వెల్లడి
  • బుధవారం నిందితుడు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లడంతో పోలీసులకు బాధిత ఐఏఎస్ ఫిర్యాదు
ఐఏఎస్ అధికారిణి వేధింపులకు గురైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్ 354 డీ కింద కేసు నమోదు చేశారు. బాధిత ఐఏఎస్ సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ విభాగం సంచాలకురాలిగా ఉన్నారు. అయితే, తాను అభిమానినంటూ నిందితుడు శివప్రసాద్ ఐఏఎస్‌ను కలుసుకునేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. గత నెల 22న కూడా కార్యాలయానికి వెళ్లాడు. తాను ఆమె అభిమానినని, సామాజిక మాధ్యమాల్లో కూడా ఆమెను అనుసరిస్తుంటానని అక్కడి సిబ్బందికి చెప్పుకొచ్చాడు. 

నిందితుడు భోజన విరామ సమయంలో పలుమార్లు కార్యాలయానికి వచ్చి వెళ్లిన విషయం తెలుసుకున్న ఐఏఎస్.. శివప్రసాద్‌ను కార్యాలయం లోపలికి అనుమతించొద్దని సిబ్బందిని ఆదేశించారు. దీంతో, అతడు ఐఏఎస్ అధికారిణిని ఏకంగా ఆమె నివాసంలో కలిసేందుకు యత్నించాడు. ఆమె చిరునామా తెలుసుకున్న అతడు బుధవారం నేరుగా ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ మోగడంతో సిబ్బంది తలుపు తీయగా వారికి స్వీట్ బాక్స్ ఇచ్చి మేడంకు ఇవ్వాలని కోరాడు. దాన్ని తిరస్కరించిన సిబ్బంది అతడిని వెనక్కు పంపించేశారు. ఇలా తరచూ అతడి నుంచి వేధింపులు ఎదురుకావడంతో బాధిత ఐఏఎస్ అధికారి కార్యాలయ అదనపు సంచాలకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Hyderabad District
Telangana
Crime News

More Telugu News