Live in Relationships: ఒక్కో సీజన్ కు ఒక్కొక్కరిని మార్చేస్తున్నారు: సహజీవనాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మన దేశంలో సహజీవనాలు చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవనాలు మన దేశంలో అంత్యంత బలమైన, సంప్రదాయబద్ధమైన వివాహ వ్యవస్థను నాశనం చేస్తాయని చెప్పింది. వివాహాలు ఇచ్చే భద్రత, సమాజ అమోదం, స్థిరమైన బంధాన్ని లివిన్ రిలేషన్ షిప్స్ ఇవ్వలేవని తెలిపింది. ఒక్కో సీజన్ కు ఒక్కో పార్ట్ నర్ ను మార్చే ఈ దరిద్రపు వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పింది. 

సహజీవనం అనేది అభివృద్ధి చెందిన సొసైటీలో భాగమని భావిస్తున్నారని హైకోర్టు విమర్శించింది. ఇలాంటి భావనకు యువత ఆకర్షితులవుతున్నారని, లివిన్ రిలేషన్ షిప్ ల వల్ల జరిగే అనర్థాలపై వారికి అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. లివిన్ రిలేషన్ షిప్ ల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని... వివాహ వ్యవస్థను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిందని తెలిపింది. 

అద్నాన్ అనే ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తున్న సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్ కు చెందిన 19 ఏళ్ల యువతి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ లో అద్నాన్ ను అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా తాము సహజీవనం చేస్తున్నామని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తాను గర్భం దాల్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోడానికి అద్నాన్ నిరాకరించాడని తెలిపింది. తప్పుడు ప్రామిస్ లతో తనతో శృంగారంలో పాల్గొన్నాడని చెప్పింది. ఈ కేసులో అద్నాన్ కు బెయిల్ మంజూరు చేస్తున్న సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.
Live in Relationships
Allahabad High Court

More Telugu News