చోరీ కుదరక బ్యాంకుపై దొంగ ప్రశంస.. గుడ్ బ్యాంక్ అంటూ కితాబు

  • తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో గురువారం ఘటన
  • నెన్నెల మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకులో చోరీకి దొంగ యత్నం
  • లాకర్ గదిలోకి వెళ్లలేక చిల్లి గవ్వ కూడా దక్కని వైనం
  • బ్యాంకును ప్రశంసిస్తూ చిట్టీ రాసిన దొంగ
  • తనను పట్టుకోవద్దని, వేలిముద్రలు కూడా దొరకవని పోలీసులకు సూచించి పరార్
బ్యాంకులో చోరీ చేసేందుకు వచ్చిన దొంగకు లాకర్ గదిలోకి వెళ్లడం అసాధ్యంగా మారింది. ఉత్తి చేతులతో వెనక్కు రావాల్సి వచ్చింది. అయితే, తన ప్రయత్నాలను విఫలం చేసిన బ్యాంకు భద్రత ఏర్పాట్లు చూసి అతడు మురిసిపోయారు. బ్యాంకును ప్రశంసిస్తూ ఓ చిట్టీ రాసిపెట్టి మరీ వెళ్లాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని నెన్నెల మండలం కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గురువారం ఓ దొంగ చోరీకి యత్నించాడు. తాళం పగలగొట్టి బ్యాంకు లోపలికి వెళ్లిన అతడు బ్యాంక్ లాకర్ గదిలోకి మాత్రం చొరబడలేకపోయాడు. చివరకు అతడికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. దీంతో, అతడు..‘‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా వేలి ముద్రలు కూడా ఉండవు’’ అంటూ పోలీసులను ఉద్దేశిస్తూ ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయాడు. మరునాడు బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Telangana Grameena bank
Mancherial District
Telangana
Crime News

More Telugu News