అమెరికా ఎన్నికల రేసులో వివేక్ రామస్వామి జోరు.. ఒక్క గంటలో రూ. 3.7 కోట్ల విరాళాల సేకరణ

Vivek ramaswamy scores over his rivals in republican party debate
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుఫున పాల్గొనేందుకు వివేక్ రామస్వామి ప్రయత్నం
  • పార్టీలో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్న వైనం
  • రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ సహా మొత్తం 8 మంది అభ్యర్థులు
  • ఇటీవల అభ్యర్థుల తొలి చర్చా కార్యక్రమంలో వివేక్ మెరుగైన ప్రదర్శన
  • చర్చ ముగిసిన తొలి గంటలోనే వివేక్‌కు రూ.3.7 కోట్ల ఎన్నికల విరాళాలు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. భారత సంతతికి చెందిన మరో నేత నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ వంటి దిగ్గజ నేతలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ మారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా మొత్తం ఎనిమిది మంది పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచారు. 

కాగా, ఇటీవల పార్టీ అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చలో వివేక్ తన ప్రత్యేకత చాటుకున్నారు. చర్చ ముగిసిన గంటలోనే ఆయనకు 4.5 లక్షల డాలర్ల విరాళాలు(రూ.3.7 కోట్లు) వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైర్హాజరీలో జరిగిన ఈ చర్చలో వివేక్ ఇతరులకు గట్టిపోటీని ఇచ్చారు. 

చర్చ తరువాత జరిగిన సర్వేలో వివేక్ అభ్యర్థిత్వానికి ఏకంగా 28 శాతం మంది మద్దతిచ్చారు. రాన్ డిశాంటిస్‌కు 27 శాతం మంది మద్దతుగా నిలవగా , మైక్‌పెన్స్‌కు 13 శాతం, నిక్కీ హేలీకి 7 శాతం మంది మద్దతు లభించింది. ఇక అమెరికా వార్త సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ వివేక్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. అందరి దృష్టినీ ఆకర్షించడంలో సఫలీకృతమయ్యారని రాసుకొచ్చింది. పార్టీ అభ్యర్థిత్వ రేసులో చివరకు తాను, ట్రంప్ మాత్రమే మిగులుతామని వివేక్ వీడియా వర్గాలతో వ్యాఖ్యానించారు.
Advertisement
Vivek Ramaswamy
Donald Trump
USA

More Telugu News