క్షిపణితో కూల్చేశారు.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై అమెరికా ఇంటెలిజెన్స్

  • అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల ప్రాథమిక అంచనా
  • మిసైల్ తో కూల్చేశారన్న పెంటగాన్ అధికార ప్రతినిధి
  • కీలక అనుచరులతో ప్రిగోజిన్ ప్రయాణంపై కొరవడిన స్పష్టత
రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈమేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే పద్ధతిలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేంటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.

మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్ బర్గ్ కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు.

Wagner chief
US intelligence
plane crash
Intentional
Explosion
prigozhin

More Telugu News