Sugar: ఏడేళ్ల తర్వాత పంచదార ఎగుమతులపై పూర్తి నిషేధం విధించబోతున్న భారత్!

  • అక్టోబర్ నుంచి ప్రారంభమయ్య సీజన్ లో పంచదార ఎగుమతులపై నిషేధం
  • వర్షాభావం వల్ల కర్ణాటక, మహారాష్ట్రలో తగ్గిన చెరుకు ఉత్పత్తి
  • దేశంలో సగానికి పైగా చెరుకును పండిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర
India is going to ban sugar exports in next season

పంచదార ఎగుమతుల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్ లో విదేశాలకు పంచదార ఎగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించబోతోంది. చక్కెర ఎగుమతులపై ఈ స్థాయిలో నిషేధం విధించబోతుండటం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. సరైన వర్షాలు లేకపోవడంతో చెరుకు ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ లో విదేశాలకు ఎగుమతి చేసేంత మిగులు పంచదార మన వద్ద ఉండదని చెప్పాయి. 

సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత సీజన్ లో 6.1 మిలియన్ టన్నుల పంచదార ఎగుమతికి మాత్రమే షుగర్ మిల్లులకు అనుమతి ఉంది. మరోవైపు గత సీజన్ లో రికార్డు స్థాయిలో 11.1 మిటియన్ టన్నుల పంచదార మన దేశం నుంచి ఎగుమతి అయింది.  

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకును ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో సగానికి పైగా చెరుకు ఈ రెండు రాష్ట్రాల్లో పండుతుంది. అయితే ఈ రుతుపవనాల సీజన్ లో ఈ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతంలో 50 శాతం వర్షం మాత్రమే కురిసింది. ఇది చెరుకు పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చెరుకు ఉత్పత్తి తగ్గడం వల్లే పంచదార ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించబోతోంది.

More Telugu News