సన్నీ డియోల్ విల్లా వేలం నోటీసులను వెనక్కి తీసుకున్న బ్యాంకు.. కాంగ్రెస్ విమర్శలు!

  • బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 56 కోట్లు తీసుకున్న సన్నీ డియోల్
  • రుణం తిరిగి చెల్లించకపోవడంతో విల్లాను వేలం వేస్తున్నట్టు ప్రకటించిన బ్యాంకు
  • సాంకేతిక కారణాలతో నోటీసులను వెనక్కి తీసుకున్నామన్న బ్యాంకు
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు చెందిన విల్లాను వేలం వేయాలని ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా ఉపసంహరించుకుంది. సన్నీ డియోల్ కు చెందిన విల్లాను నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడో బ్లాక్ చేసింది. తమ నుంచి తీసుకున్న రూ. 56 కోట్లను రికవర్ చేసుకునేందుకు ఈ నెల 25న విల్లాను వేలం వేస్తున్నట్టు నోటీసులు పంపింది. డిసెంబర్ 2022 నుంచి తమకు అసలు, వడ్డీతో కలిపి రూ 55.99 కోట్లు బకాయి పడ్డారని తెలిపింది. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే వేలం నోటీసులకు బ్యాంకు వెనక్కి తీసుకుంది. సాంకేతిక కారణాలతో నోటీసులను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. 

మరోవైపు నోటీసులను బ్యాంకు వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... రూ. 56 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించనందుకు సన్నీడియోల్ ప్రాపర్టీని బ్యాంకు వేలం వేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం దేశంలోని అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. కనీసం 24 గంటలకు కూడా గడవకుండానే నోటీసులను బ్యాంకు సాంకేతిక కారణాలతో ఉపసంహరించుకున్నట్టు తెలిసిందని ఎద్దేవా చేశారు. సాంకేతిక కారణాలను ఎవరు ప్రేరేపించారనేది తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. 


Sunny Deol
BJP
Bollywood
Villa
Auction
Congress
Jairam Ramesh

More Telugu News