BJP leader: యూపీలో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేత కాల్చివేత

  • బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయిన నిందితులు
  • ఆసుపత్రిలో మరణించిన బీజేపీ నేత
  • రాజకీయ కక్షలే కారణమన్న అనుమానం
BJP leader shot dead during evening walk in UPs Moradabad

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. నడిచి వెళుతున్న బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపి అంతమొందించారు. అనుజ్ చౌదరి (30)  మొరాదాబాద్ పట్టణ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన మరొకరితో కలసి నడిచి వెళుతున్నారు. బైక్ పై వచ్చిన దుండగులు వెనుక నుంచి కాల్పులు జరపగా, అనుజ్ చౌదరి రోడ్డుపై కుప్పకూలిపోయారు.

ముందుకు వెళ్లిన దుండగులు తిరిగి వెనక్కి వచ్చి మరో విడత.. గన్ తో సమీపం నుంచి వరుసగా కాల్పులు జరిపారు. అనంతరం బైక్ పై పరారయ్యారు. అనుజ్ చౌదరి నివసించే అపార్ట్ మెంట్ సమీపంలోనే ఈ దారుణం జరిగింది. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తెసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్సతో బతికించే ప్రయత్నంలోనే ప్రాణాలు విడిచారు. అనుజ్ చౌదరి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ మీనా ప్రకటించారు. హత్యకు రాజకీయ పరమైన కక్షలే కారణమని అనుజ్ చౌదరి కుటుంబ సభ్యుల ఆరోపణగా ఉంది. యూపీలో ఇలా కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అక్కడి పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రౌడీ ముఠాలు అప్పుడప్పుడు చెలరేగిపోతూనే ఉన్నాయి. 

More Telugu News