RBI: రుణ గ్రహీతలకు తప్పిన భారం.. రెపో రేటును మార్చని ఆర్బీఐ

  • రెపో రేటును యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ప్రతిపాదన
  • ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
  • కొంతకాలంగా ద్రవ్యోల్బణం పెరగడం పట్ల ఆందోళన
RBI keeps repo rate unchanged

రుణ గ్రహీతలకు శుభవార్త. బ్యాంక్ ఈఎంఐలపై వడ్డీ రేట్లు పెరగడం లేదు. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. ఆరుగురు సభ్యుల ఎంపీసీ కీలక రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం ఇది మూడోసారి. 

‘సంబంధిత అన్ని అంశాలపై వివరణాత్మక చర్చల తర్వాత, ఎంపీసీ పాలసీ రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని దాస్ తెలిపారు. పర్యవసానంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద ఉన్నాయి. 

అయితే, గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం పట్ల గవర్నర్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆర్బీఐ రెపో రేటును యాథాతథంగా కొనసాగించడానికి ప్రేరేపించిందని అన్నారు. కాగా, రెపో రేట్లలో మార్పు లేకపోవడం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండబోదు. దాని వల్ల ఈఎంఐలు చెల్లించే వారికి భారం ఉండదు.

More Telugu News