నకిలీ రెంటల్ రసీదుతో పన్ను మినహాయింపు పొందుతున్నారా? జాగ్రత్త!
- టెక్నాలజీ సాయంతో నకిలీలను గుర్తిస్తున్న ఆదాయపన్ను శాఖ
- ఆధారాలు చూపాలంటూ పన్ను చెల్లింపుదారులకు నోటీసులు
- నకిలీ అని తేలితే 200 శాతం వరకు పెనాల్టీ
పన్ను అధికారులు అడిగినప్పుడు అద్దె చెల్లింపులకు సంబంధించి అసలైన ఆధారాలు చూపిస్తే ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. ఆధారాలు చూపించలేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత, వాటిని ప్రాసెస్ చేసే సమయంలో ఇలాంటి మినహాయింపులపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసిన వారికి, ఆధారాలు చూపించాలని కోరుతూ ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేస్తోంది.
నకిలీ క్లెయిమ్ లను గుర్తించేందుకు ఆదాయపన్ను శాఖ టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులు పేర్కొనే వివరాల ఆధారంగా వాస్తవాన్ని గుర్తిస్తోంది. తల్లిదండ్రులకు అద్దె చెల్లించినట్టు రిటర్నుల్లో కొందరు పేర్కొంటున్నారు. అదే సమయలో అద్దె ఆదాయం వచ్చినట్టు వారి తల్లిదండ్రుల రిటర్నుల్లో ఉండడం లేదు. అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తోంది. తప్పుడు క్లెయిమ్ లు చేసినట్టు గుర్తిస్తే చెల్లించాల్సిన పన్నుకు 200 శాతం వరకు పెనాల్టీగా విధిస్తోంది.