Revanth Reddy: కేసీఆర్ రాసిపెట్టుకో.. ఇదే నా శపథం: రేవంత్‌రెడ్డి

TPCC Chief Revanth Reddy Dares CM KCR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో రేవంత్‌ మాట్లాడుతూ.. తుది దశ తెలంగాణ ఉద్యమంలో దొర గడీలో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గద్దర్ లక్ష్యాన్ని చేరుకునే వరకు అకుంఠిత కార్యదీక్షతో పనిచేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పిండం పెడతామని, కేసీఆర్‌ను రాజకీయంగా సమాధి చేస్తామని, ఇదే తన శపథమని, రాసిపెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ గోచి ఊడగొట్టే వరకు సమాజంలో వేలాదిమంది గద్దర్‌లు పుట్టుకొస్తారని అన్నారు.

నీకు వీలుకాకుంటే కేటీఆర్‌ను పంపు
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని సవాలు విసిరారు. ఆయనకు వీలుకాకుంటే మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లలో ఎవరో ఒకరిని పంపాలని సూచించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి చర్చను మొత్తం తనపైనే నడిపించారని మండిపడ్డారు. తనను దూషించడానికి, కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేందుకే ప్రయత్నించారని అన్నారు. 

కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నది టీడీపీనే
తాను, కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చామని గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండై నిలువ నీడలేకుండా నడి బజార్లో నిల్చుంటే టీడీపీ అక్కున చేర్చుకుందని తెలిపారు. చంద్రబాబు అనుచరుడిగానే కేసీఆర్ ప్రస్థానం ప్రారంభమైందని పేర్కొన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాకారమైందని తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఆయన పార్టీ బతుకే కాంగ్రెస్ దయవల్ల కలిగిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు తీసుకున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ను భుజాలపై మోసి గెలిపించాం
2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు సమయంలో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని, మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్‌ను భుజాలపై మోసి గెలిపించామని రేవంత్ చెప్పుకొచ్చారు. లిక్కర్, నిక్కర్ పార్టీలు ఒక్కటయ్యాయని గద్దర్ తన చివరి రోజుల్లో చెప్పారని గుర్తు చేసుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
BRS
KCR

More Telugu News