గద్దరన్న ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది: చిరంజీవి

  • జన గాయకుడు గద్దర్ కన్నుమూత
  • గద్దరన్నకు లాల్ సలాం అంటూ స్పందించిన చిరంజీవి
  • ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని వ్యాఖ్యలు
  • గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ట్వీట్
ప్రజా ఉద్యమకారుడు గద్దర్ మరణం పట్ల అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం, ఏ పాట పాడినా దానికో ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకు లాల్ సలాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తి రగిలించారని కొనియాడారు. అలాంటి గద్దరన్న ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందని పేర్కొన్నారు. 

ప్రజాసాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనిదని, పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని చిరంజీవి వివరించారు. గద్దరన్న కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

Gaddar
Demise
Chiranjeevi
Condolence

More Telugu News