అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

  • వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని కామెంట్
  • సొంత వాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు..
  • గతేడాది రాజా సింగ్ పై సస్పెన్షన్ విధించిన బీజేపీ
అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీకి రాకపోవచ్చని అన్నారు. ఎన్నికలలో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు రాజా సింగ్ చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

జంటనగరాల్లో రాజాసింగ్ కు బీజేపీ శ్రేణుల్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ.. గతేడాది మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాజాసింగ్ ను చిక్కుల్లో నెట్టాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్.. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శాసన సభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లిన రాజాసింగ్, బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


More Telugu News

Goshamahal MLA Raja Singh Assembly