బెంగళూరులో తెలుగు కుటుంబం ఆత్మహత్యకు ఆర్థికసమస్యలే కారణమన్న పోలీసులు

  • మచిలీపట్నానికి చెందిన టెకీ బెంగళూరులో ఆత్మహత్య
  • అంతకుమునుపు భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య
  • షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన టెకీ
  • ఆర్థికకష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు బెంగళూరు డీసీపీ వెల్లడి
బెంగళూరులో గతవారం తెలుగు కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తాజాగా గుర్తించారు. మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయ్(31) తన భార్య హైమావతి(29), ఇద్దరు కుమార్తెలతో కలిసి సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంట్‌లో నివసించేవారు. జులై 31 వారందరూ విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని ఆర్థికకష్టాలు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డట్టు గుర్తించారు. 

విజయ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి డబ్బంతా పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడు తన భార్య, ఏడాదిన్నర, ఆరు నెలల వయసున్న ఇద్దరు కూతుళ్లను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బెంగళూరు డీసీపీ వెల్లడించారు. కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేసినట్టు ఫోరెన్సిక్ నిపుణులు అంచనాకు వచ్చారని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మ‌ృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నంలో వారి అంత్యక్రియలు జరిగాయి.

Machilipatnam
Bengaluru
Crime News

More Telugu News