మేమేం ఇక్కడకు వచ్చి మంత్రులు అయ్యేది లేదు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్

KC Venugopal takes class to Congress leaders
  • ఎన్నికలకు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉందని వెల్లడి
  • ఇంకా కొట్లాడుకుంటే ఇక మీ ఇష్టమని అసహనం
  • అన్ని అంశాలను పక్కన పెట్టి ఈ వంద రోజులు కలిసి పని చేయాలని సూచన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం క్లాస్ తీసుకున్నారు! ఆయన ముందే మండల కమిటీలకు సంబంధించి ఇరువురు సీనియర్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. 

ఎన్నికలకు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇంకా కొట్లాడుకుంటుంటే ఇక మీ ఇష్టమని, నేతలు అందరూ అన్ని అంశాలను పక్కన పెట్టి ఈ వంద రోజులు కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము ఇక్కడకు వచ్చి మంత్రులు అయ్యేది ఏమీ లేదని, కలిసి ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.

గాంధీ భవన్‌లో తెలంగాణ పార్లమెంట్ పరిశీలకులతో కేసీ వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ పరిస్థితులు, నేతల పని తీరుపై అధిష్ఠానం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందాయన్నారు. సర్వేల ప్రకారమే టిక్కెట్లు వస్తాయన్నారు. 

ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు సీనియర్ల మధ్య వాడివేడిగా...

ఈ భేటీ సందర్భంగా ఇద్దరు సీనియర్ నేతల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మండల కమిటీల విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పక్క జిల్లా మండల కమిటీల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, ఏ జిల్లా నాయకుడు ఆ జిల్లాను చూసుకుంటే సరిపోతుందని పీసీసీ చీఫ్ చెప్పాడని తెలుస్తోంది. 

దీనికి మరో సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ స్పందిస్తూ... పక్క జిల్లాల్లో తమకూ అనుచరులు ఉంటారని, తాము ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నామనని, కొత్తగా వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తే ఎలా? అని రుసరుసలాడినట్టు సమాచారం. అంతేకాదు, తమను కలుపుకొని వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పాత పది జిల్లాల నాయకులను పిలిచి మాట్లాడితే సరిపోతుందని రేవంత్ రెడ్డికి దామోదర రాజనర్సింహ సూచించినట్లుగా తెలుస్తోంది. మండల కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
Go Back to Shorts
kc venugopal
Congress
Revanth Reddy
Telangana

More Telugu News