Chandrababu: పులివెందులలో నా సభకు ఎంతమంది వచ్చారో జగన్ చూడాలి: చంద్రబాబు

Chandrababu powerful speech in Pulivendula
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లా పులివెందుల గడ్డపై సింహగర్జన చేశారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, కొదమసింహంలా అణచివేస్తానని వైసీపీ నేతలను హెచ్చరించారు. పులివెందులలో తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఎవరొస్తారో రండి చూసుకుందాం అంటూ సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో సవాల్ విసిరారు.  

తన సభకు భారీగా జనం తరలిరావడం పట్ల చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. ఇవాళ పులివెందులలో నా సభకు ఎలాంటి స్పందన వచ్చిందో జగన్ చూడాలి అని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రజలను చూసైనా తాడేపల్లిలో ఉన్న నేతలో మార్పు రావాలని ఎత్తిపొడిచారు. స్థానిక టీడీపీ నేతలు వై నాట్ పులివెందుల? అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. కేంద్రం ఆంధ్రులకు ఇచ్చిన పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట రూ.5 వేల కోట్లు దోచుకోవాలన్నది జగన్ ప్రణాళిక అని ఆరోపించారు. పులివెందుల రైతులను జగన్ దారుణంగా మోసం చేశాడని అన్నారు. పులివెందులలో టన్నెల్ అంటున్నారు... అది మోసం కాదా? అని నిలదీశారు. నీళ్లు లేని కాలువలకు కనెక్షన్ ఇస్తాడంట అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చాకే, చెన్నైకి నీళ్లు ఇవ్వాలని నాడు ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్ఆర్ బీసీ ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్ అని వెల్లడించారు. 

"నేను వచ్చాక ముచ్చుమర్రిలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేశాను. జీడిపల్లి నుంచి రెండు టీఎంసీల నీరు తీసుకువచ్చి పంటలు కాపాడాను. గండికోట ప్రాజెక్టుకు నీరు తెచ్చిన ఘనత మాదే. పైడిపాలెంకు నీళ్లు తీసుకెళ్లాం... పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత మాదే. పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకురావడమే నా జీవిత ఆశయం. నల్లమలలో 32 కి.మీ టన్నెల్ ద్వారా బనకచర్లకు నీరు ఇస్తాం. బనకచర్ల ద్వారా రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి. 

రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా మార్చుతాం. మేం అధికారంలోకి వచ్చాక గండికోటలో రాయల వారి విగ్రహం ఏర్పాటు చేస్తాం. పులివెందులకు హైవే వస్తుందంటే అది టీడీపీ ఘనతే. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తపించాను. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరిచ్చే బాధ్యత నాదే" అంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

"నిన్న ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు... విశాఖలో ఓ షాపింగ్ మాల్ కడుతున్నాడంట... దానికి ఈయనే భూమిపూజ చేశాడంట. ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ తో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోయిందంట... ఏం తమ్ముళ్లూ... ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా మనం నమ్మాలి! ఆయన ఏం మాట్లాడినా మనం విమర్శించకూడదు" అంటూ ధ్వజమెత్తారు. 

"ఈ మహానాయకుడు ఇంగ్లీషు మీడియం పెడతాడంట... మీకందరికీ తెలివి వస్తుందంట... ఉద్యోగాలు వస్తాయంట! వేముల జూనియర్ కాలేజీని చూస్తే... నాడు-నేడుతో విద్య ఎంతో అభివృద్ధి చెందిందని ప్రచారం చేసుకున్నాడు. కానీ వేముల జూనియర్ కాలేజీలో ఉత్తీర్ణత శాతం సున్నా...  ఏమనాలి ఈయనను? గొప్ప నాయకుడు కదూ!" అంటూ ఎద్దేవా చేశారు. 

"నేను గట్టిగా మాట్లాడితేనే పులివెందులలో బస్టాండ్ కట్టారు. పులివెందులలో 8 వేల గృహాలు అన్నారు... కట్టారా? పులివెందులలో ఫిష్ మార్ట్ అన్నారు... వచ్చిందా? కుందూ నదిలో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇక్కడి ఇసుకకు రెక్కలొచ్చాయి. కుందూ నది ఇసుక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళుతోంది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Chandrababu
Pulivendula
TDP
Jagan
YSRCP
Kadapa District

More Telugu News