Sajjala Ramakrishna Reddy: సీబీఐ కూడా చెత్తగా విచారణ చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. సునీత కొత్త కథను అల్లారు: సజ్జల

  • అన్ని వ్యవస్థల్లోకి చంద్రబాబు వైరస్ లా ప్రవేశించారని సజ్జల విమర్శ
  • టీడీపీ అనుకూల మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
  • సీబీఐ స్టేట్మెంట్లన్నీ ఒకే వైపు ఉన్నాయన్న సజ్జల
This is an example of CBI also doing worst investigation says Sajjala Ramakrishna Reddy

మాజీ మంత్రి వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కూడా చెత్తగా విచారణ జరుపుతుంది అని చెప్పడానికి వివేకా హత్య కేసు దర్యాప్తు ఒక ఉదాహరణ అని అన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్యకు గురైతే వైసీపీకే డ్యామేజ్ అవుతుందని... తమ కార్యకర్తలు డిప్రెస్ అయితే అది చంద్రబాబుకు లాభిస్తుందని... ఈ మాత్రం జ్ఞానం సీబీఐకి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. 

వివేకా హత్య కేసులో టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్ లా పాకిపోయారని... వ్యవస్థలను ఆయన ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరుగుతోంది విమర్శించారు. దర్యాప్తు కథలో మలుపులకు తగ్గట్టుగా వివేకా కూతురు సునీత అదనపు సమాచారం అంటూ కొత్త విషయాలను అందిస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్ల తర్వాత సరికొత్త కథను అల్లారని చెప్పారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారని అన్నారు. వివేకా పేరు మీద మచ్చ పడగూడదని అవినాశ్ రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వస్తోందని తెలిపారు. 

సీబీఐ స్టేట్మెంట్లన్నీ ఒకవైపే ఉన్నాయని... చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లను మార్చారని సజ్జల విమర్శించారు. సునీతకు వీళ్లు సలహాదారులుగా మారారని మండిపడ్డారు. 2011లోనే అవినాశ్ కు ఎంపీ టికెట్ ను ప్రకటించారని... అవినాశ్ గెలుపు కోసం వివేకా పని చేశారని చెప్పారు. గూగుల్ టేకౌట్ వర్కౌట్ కాదనే విషయం సీబీఐకి ఇప్పుడు అర్థమయిందని చెప్పారు.

 ఇంకోవైపు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత సంచలన విషయాలను వెల్లడించారు. తన తండ్రి హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత తన ఇంటికి భారతి, విజయమ్మ, సజ్జల వచ్చారని... ఆ సమయంలో భారతి చాలా ఆందోళనలో ఉన్నారని ఆమె తెలిపారు. టీడీపీ నేతలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని మీడియాకు చెప్పాలని సజ్జల తనకు సూచించారని చెప్పారు. దీనిపై సజ్జల మాట్లాడుతూ, సునీత ఇంటికి భారతమ్మతో కలిసి తాను వెళ్ళలేదనీ, తాను, తన భార్య కలిసి వెళ్లి పరామర్శించామని చెప్పారు. అలాగే సునీతను ప్రెస్ మీట్ పెట్టమని కానీ, అవినాశ్ ను డిఫెండ్ చేస్తూ చెప్పమని కానీ తాను చెప్పలేదని సజ్జల స్పష్టం చేశారు.    

More Telugu News