Devineni Uma: 6 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ లో వెళ్లారు.. ఎంత భయం ఉందో అర్థమవుతోంది: దేవినేని ఉమా

  • జగన్ ను పులివెందుల పులి అని కాకుండా తాడేపల్లి పిల్లి అంటున్నారన్న దేవినేని ఉమా
  • సైకో చేతిలో రాష్ట్రం విలవిల్లాడుతోందని విమర్శ
  • సీబీఐ ఛార్జ్ షీట్ తో తాడేపల్లిలో భయాందోళన మొదలయిందని వ్యాఖ్య
Jagan is afraid of Amaravati says Devineni Uma

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తాడేపల్లి నుంచి వెంకటాయపాలెంకు మధ్య దూరం 6 కిలోమీటర్లే అయినప్పటికీ హెలికాప్టర్ లో వెళ్లాడంటే ఆయనకు ఎంత భయం ఉందో అర్థమవుతోందని అన్నారు. అందుకే జగన్ ను పులివెందుల పులి అని కాకుండా... తాడేపల్లి పిల్లి అని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. న్యాయం కోసం రోడ్డెక్కిన మహిళలు, దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దారుణమని చెప్పారు. 

సైకో చేతిలో రాష్ట్రం విలవిల్లాడుతోందని దేవినేని ఉమా అన్నారు. వివేకా హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న జగన్ కుటుంబ సభ్యుల్లో వణుకు మొదలయిందని చెప్పారు. సీబీఐ ఛార్జ్ షీట్ కొంత మేర బయటకు రావడంతో తాడేపల్లిలో భయాందోళన మొదలయిందని అన్నారు.

కాగా, ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు దేవినేని ఉమా సంఘీభావం ప్రకటించారు. శ్రీనివాస్ తో కలిసి కొంత దూరం ప్రయాణించారు.

More Telugu News