Madurai: మారథాన్ పరుగు.. గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడి మృతి

మారథాన్ పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆదివారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి. మూర్తి జెండా ఊపి ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు. కల్లకురిచికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఈ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. 

అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్‌రూంలోకి వెళ్లాడు. ఆ తరువాత అతడు బాత్రూమ్‌లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడంతో స్నేహితులు గుర్తించి అతడిని సమీపంలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితుడికి కృత్రిమ శ్వాస, జీవనాధార వ్యవస్థపై ఉంచి చికిత్స ప్రారంభించారు. ఉదయం పది గంటల సమయంలో దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దినేశ్ మధురైలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
Madurai
Tamilnadu
Heart stroke

More Telugu News