కేసీఆర్ సెంటిమెంట్ ఆలయంలో దొంగల బీభత్సం!

  • సిద్దిపేట జిల్లా కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో దొంగతనం
  • హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు.. 
  • కేసీఆర్‌‌కు ఈ ఆలయం అత్యంత ఇష్టమైనది
  • ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ గుడిలోనే పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌ రావుకు సెంటిమెంట్ అయిన ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కొనాయిపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. గుడిలోని హుండీని ఎత్తుకెళ్లారు. 

కేసీఆర్‌‌కు ఈ ఆలయం అత్యంత ఇష్టమైనది. గతంలో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ముందు నామినేషన్ పత్రాలను ఈ ఆలయంలో పెట్టి పూజలు చేసి, ఆ తర్వాతే నామినేషన్ దాఖలు చేసేవారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కూడా ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ పలుమార్లు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

మంత్రి హరీశ్‌ రావుకూ ఈ ఆలయం అత్యంత సెంటిమెంట్. ప్రతి ఎన్నికలప్పుడు ఇక్కడ నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో దొంగలు పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. దొంగలు మరికొన్ని ఆలయాల్లో కూడా చోరీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KCR
thieves stole hundi
konaipally
venkateswara swamy temple
Siddipet

More Telugu News