బ్లాక్ మెయిల్ చేస్తూ బతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసు?: దాసోజు శ్రవణ్

Dasoju Sravan fires on Revanth Reddy
  • ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు!
  • తీవ్రంగా మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు
  • 3 గంటల్లో 3 ఎకరాలు ఎలా తడుస్తాయని ఆగ్రహం
  • రేవంత్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శలు
  • రేవంత్ ను చంద్రబాబు తోలుబొమ్మలా ఆడిస్తున్నట్టుందన్న శ్రవణ్    
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అంశంలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేస్తూ, భూ దందాలు చేసుకుంటూ బతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. 

మూడు గంటల్లో మూడు ఎకరాలకు నీళ్లు ఎలా పారతాయని నిలదీశారు. అతి తెలివి మాటలు కట్టిపెట్టి... మూడు గంటలలో మూడు ఎకరాలు ఎలా పారతాయో చేసి చూపించాలని సవాల్ విసిరారు. 

రేవంత్ ఇంట్లో 24 గంటలూ కరెంట్ ఉండాలి కానీ, రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదా? అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులను పీడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. 

తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ గా మార్చారని విమర్శించారు. రేవంత్ ను చంద్రబాబు తోలుబొమ్మలా ఆడిస్తున్నట్టుందని, అందుకే రేవంత్ ఇలా మాట్లాడుతున్నాడని శ్రవణ్ ఆరోపించారు. చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వంపైనా, ఆత్మగౌరవంపైనా దాడి చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
Advertisement
Dasoju Sravan
Revanth Reddy
Free Electricity
BRS
Congress
Telangana

More Telugu News