Nara Lokesh: 2 వేల కిలోమీటర్లు... చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న లోకేశ్ పాదయాత్ర

  • యువగళం పాదయాత్రలో 4 వేల కి.మీ నడవాలని లోకేశ్ నిర్ణయం
  • ఇప్పటివరకు 2 వేల కిలోమీటర్లు పూర్తి
  • చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచిన కావలి నియోజకవర్గం
  • పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం
Nara Lokesh Yuvagalam completes 2000 kms at Kothapalli in Kavali constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు.

యువగళం పాదయాత్ర 2వేల కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు గోనుగోంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన లోకేశ్ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఉపయోగపడే ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు అందజేశారు. పులివెందులకు చెందిన వీరారెడ్డికి ఈ సందర్భంగా లక్షరూపాయల ఆర్థిక సాయం చేశారు.

కాగా, యువగళం పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, మీనాక్షినాయుడు తదితరులు లోకేశ్ ను కలిసి అభినందనలు తెలిపారు.
రూ.5 వేల విరాళమిచ్చిన దివ్యాంగుడు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5 వేల విరాళాన్ని లోకేశ్ కు అందజేశారు. గతంలో కూడా జీవన్ పార్టీకి విరాళమిచ్చారు. 1998లో తనకు చంద్రబాబునాయుడు కాలి శస్త్రచికిత్స చేయించారని, బాబును సీఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ ను లోకేశ్ అభినందించారు.

యువగళం 2 వేల కి.మీ మైలురాయి చేరుకోవడంపై లోకేశ్ స్పందన...

"కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా పాదయాత్ర ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను"

More Telugu News