రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు!

justice nv ramana speech at tana conference
  • రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామన్న జస్టిస్ రమణ
  • ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతారని ప్రశ్న
  • సోషల్‌ మీడియాలో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన
  • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు తెలుగువారు విశ్రమించకూడదని పిలుపు
రాజకీయాలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో జస్టిస్‌ రమణ ప్రసంగించారు. రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామని, పార్టీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతారని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయని అన్నారు. సోషల్‌ మీడియాలో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారింది. మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రలోభ అంశాలకు ప్రాధాన్యత పెంచి ఓట్లు దండుకుంటున్నారు’’ అని జస్టిస్‌ రమణ విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి నీతిమంతులు రాకపోతే.. నీతిలేని వారే రాజ్యమేలుతారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Justice N.V. Ramana
tana conference
politics
Supreme Court
democracy

More Telugu News