Kollapur: కొల్లాపూర్ సభ నిర్వహణపై మొయినాబాద్ రిసార్ట్ లో కాంగ్రెస్ నేతల భేటీ!

  • ఇటీవల ఖమ్మంలో కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్
  • తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
  • ఈ నెల 20 తర్వాత కొల్లాపూర్ సభ
  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న జూపల్లి కృష్ణారావు
  • కొల్లాపూర్ సభకు ప్రియాంక గాంధీ వస్తారని ప్రచారం!
Telangana Congress leaders held meeting for Kollapur rally

ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టి కొల్లాపూర్ సభపై కేంద్రీకృతమై ఉంది. ఈ సభను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలోనూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్న నేపథ్యంలో, ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.

తాజాగా, కొల్లాపూర్ సభ నిర్వహణపై కాంగ్రెస్ నేతలు నేడు మొయినాబాద్ లోని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారు. సీనియర్ నేత మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జులై 20 తర్వాత కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించడంపై నేటి సమావేశంలో చర్చించినట్టు సమాచారం. 

కాగా, కొల్లాపూర్ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ సభను కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.

More Telugu News