KCR: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు

  • బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాలు షురూ చేసిన కేసీఆర్
  • ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కార్యక్రమం
  • మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువాలు కప్పిన కేసీఆర్
  • అభివృద్ధి నిరోధకులను గెలిపించవద్దని మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి
  • బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ముంగిటకే వచ్చిందని వెల్లడి
KCR welcomes Maharashtra leaders into BRS

బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్రకు చెందిన నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన మరికొందరు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పారు. షోలాపూర్, నాగపూర్ ప్రాంతాలకు చెందిన ఆ నేతలకు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం విస్తరింపజేస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ లో త్వరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? అని కేసీఆర్ ప్రశ్నించారు. 

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, సొంత పార్టీలనే చీల్చుతున్నారని, పదవుల కోసం వేరే పార్టీల్లోకి వెళుతున్నారని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులను ఈసారి గెలిపించవద్దంటూ మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ముంగిటకే వస్తోందని అన్నారు.

More Telugu News