సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా, ఆనం రామనారాయణరెడ్డి, దివంగత వివేకానందరెడ్డిలకు పార్టీలకు అతీతంగా బలమైన సొంత అనుచరవర్గం ఉంది. జిల్లా రాజకీయాలపై వారు తమదైన ముద్ర వేశారు. 

అయితే, వారి సోదరుడు జయకుమార్ రెడ్డి చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడాయన వైసీపీలో చేరడం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు టీడీపీకి దగ్గర కాగా, ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన జయకుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా జయకుమార్ రెడ్డి వెంట మరో సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.


More Telugu News