లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు చేసేందుకు అనుమతినిచ్చిన ఏసీబీ కోర్టు

  • ఉండవల్లిలో చంద్రబాబు నివాసంగా లింగమనేని గెస్ట్ హౌస్
  • చంద్రబాబు క్విడ్ ప్రో కో పద్ధతిలో గెస్ట్ హౌస్ పొందారంటున్న సీఐడీ
  • గెస్ట్ హౌస్ జప్తు కోసం జీవో ఇచ్చిన ఏపీ సర్కారు
  • జప్తు చేసేందుకు కోర్టు అనుమతి కోరిన సీఐడీ అధికారులు
ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. 

రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న ఈ గెస్ట్ హౌస్ లింగమనేని రమేశ్ కు చెందినది. అయితే, ఈ గెస్ట్ హౌస్ ను చంద్రబాబు అక్రమ మార్గాల్లో పొందారని, సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్  రోడ్ అలైన్ మెంట్ విషయంలో లింగమనేనికి లబ్ది కలిగేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారని, అందుకు ప్రతిగా కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ను పొందారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. 

ఈ నేపథ్యంలో, లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాంతో, గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి కోరుతూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 

సీఐడీ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు... ఇరుపక్షాల వాదనలను పూర్తిస్థాయిలో విన్న అనంతరం, లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి నిచ్చింది. అయితే, జప్తు చేసేందుకు ముందు లింగమనేని రమేశ్ కు నోటీసులు ఇవ్వాలని సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది.

Lingamaneni Guest House
Chandrababu
ACB Court
CID
Undavalli
Amaravati

More Telugu News