న్యాయమూర్తా... మజాకా!

  • జైపూర్ కోర్టులో ఆసక్తికర ఘటన
  • భర్తపై వరకట్నం కేసు పెట్టిన మహిళ
  • భార్యకు జీవనభృతి చెల్లించాలన్న కోర్టు
  • కోర్టు ఆదేశాలను పట్టించుకోని భర్త జైలుపాలు
  • రూ.55 వేల విలువ చేసే నాణేలు కోర్టుకు సమర్పించిన బంధువులు
  • లెక్కించే బాధ్యత భర్తకే అప్పగించిన జడ్జి
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దశరథ్ కుమావత్ 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళను పెళ్లాడాడు. కొన్నాళ్ల తర్వాత సీమా తన భర్తపై వరకట్నం కేసు పెట్టింది. గత ఐదేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. 

అయితే, భార్యకు జీవనభృతి కింద రూ.2.25 లక్షలు చెల్లించాలంటూ కోర్టు దశరథ్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను దశరథ్ పెడచెవినపెట్టడంతో అతడిని జైల్లో వేశారు. దాంతో అతడి కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సిన జీవనభృతిని చెల్లించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ.55 వేల నగదు కోర్టుకు సమర్పించారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ డబ్బులో ఒక్క కరెన్సీ నోటు కూడా లేదు... అన్నీ నాణేలే. రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలతో కూడిన 7 పెట్టెలను దశరథ్ బంధువులు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ నాణేల బరువు 280 కేజీలు. 

దీనిపై సీమా న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింటుకు చెల్లించాల్సిన జీవనభృతిని ఇలా నాణేల రూపంలో  తీసుకురావడం కచ్చితంగా కక్షసాధింపు చర్య కిందకే వస్తుందని వాదించారు. 

కాగా, ఈ నాణేల పెట్టెలను చూసి జడ్జి విస్మయం చెందారు. ఇవన్నీ లెక్కపెట్టడం అయ్యే పనేనా అని ఆలోచించారు. ఈ క్రమంలో తెలివిగా ఆదేశాలు ఇచ్చారు. జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను రూ.1000 చొప్పున బ్యాగుల్లో ఉంచి, సులువుగా లెక్కపెట్టేందుకు వీలుగా కోర్టుకు అందించాలని, జూన్ 26 లోగా ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు.


More Telugu News

Judge Maintainance Wife Husband Coins Jaipur Rajasthan