Sovereign Gold Bonds: బంగారంపై ఏటా 13 శాతానికి పైగా రాబడి!

  • 2015లో ప్రారంభమైన సావరీన్ గోల్డ్ బాండ్ పథకం
  • ఇప్పటి వరకు 66 విడతల్లో పెట్టుబడుల సమీకరణ
  • కనిష్ఠ రాబడి 4.48 శాతం.. గరిష్ఠ రాబడి 51.89 శాతం
Sovereign Gold Bonds SGB investments have returned above 13 percent  over last 8 years

సార్వభౌమ బంగారం బాండ్లు పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందిస్తున్నాయి. గత ఎనిమిదేళ్ల గణాంకాలను చూస్తే ఇదే విషయం తెలుస్తుంది. 2015లో ఈ పథకాన్ని కేంద్ర సర్కారు ప్రారంభించింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను తగ్గించేందుకు, ఈ డిజిటల్ బంగారం బాండ్ ను తీసుకొచ్చింది. భౌతిక బంగారంపై పెట్టుబడులను తగ్గిస్తే అది దిగుమతుల భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా కరెంటు ఖాతా లోటు కూడా తగ్గుతుంది. 

2015 నుంచి ఇప్పటి వరకు ఆర్ బీఐ 66 విడతల్లో బంగారం బాండ్లలో పెట్టుబడులను స్వీకరించింది. అప్పటి నుంచి చూసుకుంటే సగటు వార్షిక రాబడి రేటు 13.77 శాతంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నాటి నుంచి ప్రతి విడత సార్వభౌమ బంగారం బాండ్ల పథకంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే, ఏడాదికి కనిష్ఠంగా 4.48 శాతం నుంచి గరిష్ఠంగా 51.89 శాతం చొప్పున రాబడులు వచ్చాయి. 

పైగా దీనికి ఏటా ఆర్ బీఐ చెల్లించే 2.5 శాతం వడ్డీ రేటు అదనం అని చెప్పుకోవాలి. సార్వభౌమ బంగారం బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం చొప్పున పథకం కాల వ్యవధి ఎనిమిదేళ్ల పాటు వడ్డీ చెల్లిస్తారు. కాల వ్యవధి ముగిసిన తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా బంగారం పరిమాణంపై చెల్లింపులు చేస్తారు. అంతేకాదు ఎనిమిదేళ్లపాటు ఇందులో పెట్టుబడి కొనసాగించి వారికి.. లాభం ఎంత వచ్చినా దానిపై పన్ను ఉండదు.

More Telugu News