పవన్ కల్యాణ్ కు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించాలి: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

తనకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. 

ప్రాణహాని ఉందన్న విషయాన్ని పవన్ ఇప్పుడు తెలుసుకున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మాతో కలిసి పనిచేస్తున్నారని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీది అధికారం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అని ఆదినారాయణరెడ్డి తెలిపారు. పవన్ కల్యాణ్ కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పవన్ కు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించాలని సూచించారు. 

ఎన్ని కోట్లు సంపాదించినా జగన్ ఆశ తీరదని అన్నారు. జగన్ నిత్య అసంతృప్తి వాది అని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆదినారాయణరెడ్డి వివరించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్నింట్లోనూ సకల శాఖల మంత్రి జోక్యమేనని పరోక్ష విమర్శలు చేశారు. 

అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన తమ్ముడిని పెట్రోల్ పోసి చంపుతారా? ఇలాంటి ఘటనలకు జగన్ నైతిక బాధ్యత వహించాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో అందరి బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు.


More Telugu News