Noida: నోయిడాలో కొత్త బ్రిడ్జిని బలవంతంగా ప్రారంభించేసిన పబ్లిక్.. వీడియో ఇదిగో!

  • నిర్మాణం పూర్తయినా బ్రిడ్జిని ప్రారంభించకపోవడంపై జనంలో ఆగ్రహం
  • బారికేడ్లు తొలగించి వాహనాలతో బ్రిడ్జిపై రాకపోకలు
  • సోమవారం మధ్యాహ్నం ఘటన.. కాసేపటికి బ్రిడ్జిని మళ్లీ మూసేసిన ట్రాఫిక్ సిబ్బంది
Frustated people open Noida Parthala Signature Bridge by themselves

ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా నిర్మించిన కొత్త బ్రిడ్జి ఎంతకీ ప్రారంభించడంలేదు.. దీంతో విసుగుచెందిన వాహనదారులు బ్రిడ్జిని తామే ప్రారంభించారు. బారికేడ్లను తొలగించి బ్రిడ్జి ఎక్కారు. ఇది గమనించిన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బ్రిడ్జిని తిరిగి మూసేశారు. నోయిడాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. 
గ్రేటర్ నోయిడాను, నోయిడాను కలిపే దారిలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంకాలం పూట అయితే వాహనదారులకు రోడ్డుపైనే నరకం కనిపిస్తుంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో నత్తనడకన ముందుకు సాగాల్సి వస్తుంది. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పార్థలా సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మించింది. ఈ బ్రిడ్జితో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని వాహనదారులు కూడా సంతోషించారు. 

నిర్మాణం పూర్తయింది, ఈ నెల 13న బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సోమవారం మధ్యాహ్నం ఈ బ్రిడ్జి దగ్గర మరోమారు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విసుగుచెందిన కొంతమంది వాహనదారులు బ్రిడ్జిపైకి ఎక్కకుండా అడ్డంగా పెట్టిన పైపులను పక్కకు జరిపారు. తమ వాహనాలతో బ్రిడ్జి పైకెక్కి అనధికారికంగా వంతెనను ప్రారంభించేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది బ్రిడ్జిని మూసేశారు.

More Telugu News