Hyderabad: బాలింతరాలైన భార్య శృంగారానికి ఒప్పుకోలేదని చంపేసిన భర్త.. హైదరాబాద్ లో ఘోరం

  • ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు కడతేర్చిన కసాయి భర్త
  • ఆపై భార్యది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం
  • బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • విచారణలో అసలు విషయాన్ని వెల్లడించిన భర్త
Hyderabad man Terminate wife after she refuses love making month after delivering second child

నెల కిందటే రెండో బిడ్డకు జన్మనిచ్చింది.. పచ్చి బాలింతరాలు.. ఓవైపు నొప్పులతో సతమతమవుతున్న సమయంలో శృంగారం చేయాలంటూ భర్త బలవంతపెట్టాడు. ఇలాంటి పరిస్థితిలో ఎలాగంటూ తిరస్కరించిందామె. అయినా వదలక బలవంతపెట్టాడు, ఎంతకూ ఒప్పుకోవడంలేదని కోపంతో ఆమెను చంపేశాడు. హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ లో జరిగిందీ దారుణం. పోలీసుల విచారణలో నిజాలు బయటపడడంతో ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడా కసాయి భర్త.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తరుణ్, ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ వచ్చి ఐఎస్ సదన్ లోని ఖాజా బాగ్ లో స్థిరపడ్డారు. తరుణ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు రెండేళ్ల కొడుకు ఉండగా.. ఏప్రిల్ 16న ఝాన్సీ మరో బిడ్డకు జన్మనిచ్చింది. మే 20న భార్యతో శృంగారానికి తరుణ్ బలవంత పెట్టాడు. శారీరక అవస్థలను కారణంగా చూపుతూ భర్త కోరికను ఝాన్సీ తిరస్కరించింది. అయినా వదలకుండా తరుణ్ బలవంతంగా శృంగారంలో పాల్గొనడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బలవంతంగా తన చేతితో ఝాన్సీ నోరు మూశాడు.

దీంతో ఊపిరి ఆడక ఝాన్సీ స్పృహ తప్పింది. భార్య పరిస్థితి చూసి భయపడిన తరుణ్.. వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. ఝాన్సీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఝాన్సీని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే ప్రాణం పోయిందని ప్రకటించారు. ఝాన్సీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వైద్యులతో పోస్ట్ మార్టం నిర్వహించారు. విచారణలో భాగంగా తరుణ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో తరుణ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు.

More Telugu News