నారా లోకేశ్ పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. చితకబాదిన టీడీపీ కార్యకర్తలు

టీడీపీ యువనేత చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పెద్దగా తరలి వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరులో పాదయాత్ర సందర్భంగా ఓ ఆకతాయి లోకేశ్ పై కోడిగుడ్డు విసిరాడు. అయితే అది లోకేశ్ కు తగలలేదు. కొద్దిగా మిస్ అయి లోకేశ్ భద్రతా సిబ్బందిపై పడింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు ఆ ఆకతాయిని వెంబడించి పట్టుకుని చితకబాదారు. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై లోకేశ్ మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన జరిగిన స్థలంలోనే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి విడిది కేంద్రానికి వెళ్లిపోయారు. మరోవైపు కోడిగుడ్డు విసిరిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News