మా వాళ్లను టచ్ చేస్తే నాలోని పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడు: కొండా మురళి

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కొండా దంపతుల అనుచరులు నిన్న బాహాబాహీకి తలపడ్డారు. జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. చెప్పులతో కొట్టుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ ఇరు వర్గాలు సమావేశాన్ని యుద్ధ భూమిగా మార్చారు. 

ఈ నేపథ్యంలో కొండా మురళి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెప్పారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదేనని తెలిపారు. టికెట్ సురేఖదే అని మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారని అన్నారు. 

తన వాళ్లు అయిన కార్యకర్తలు, నాయకులు, యూత్ కాంగ్రెస్ పిల్లలను ఎవరు టచ్ చేసినా... పోలీసులకు చెప్పి మరీ క్రేన్ కు వేలాడదీసి ఉరి వేస్తానని హెచ్చరించారు. ముందుగా పోలీస్ కమిషనర్ కు, ఏసీపీకి చెపుతానని.... వాళ్లు చర్యలు తీసుకోకపోతే మాత్రం... తనలోని పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడని అన్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.

Konda Murali
Konda Surekha
Errabelli Swarna
Congress

More Telugu News