Maharashtra: పార్ట్ టైమ్ జాబ్ పేరుతో వల.. పూణె వ్యక్తి ఖాతా నుంచి 96 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

  • మహారాష్ట్రలో కొత్తరకం సైబర్ మోసం
  • తొలుత వెల్కం బోనస్ కింద రూ.10 వేలు జమచేసి నమ్మించిన మోసగాళ్లు
  • ప్రీపెయిడ్ టాస్క్ ల పేరుతో డబ్బులు వసూలు
  • చిన్న మొత్తాలకు కొంత కమీషన్ కలిపి తిరిగి చెల్లింపు
  • నమ్మకం కుదిరాక లక్షల్లో వసూలు చేసి ఫోన్ స్విచ్ఛాప్ చేసిన కేటుగాళ్లు
Pune man loses Rs 96 lakh from bank account after scammer offered him part time job

మహారాష్ట్రలో మరో కొత్త రకం సైబర్ మోసం జరిగింది. పార్ట్ టైమ్ ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి ఖాతాలో నుంచి కేటుగాళ్లు 96 లక్షలు కాజేశారు. ట్రావెల్ ఏజెన్సీలకు రేటింగ్ ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని చెప్పారు. తొలుత నమ్మకం కలిగేందుకు బాధితుడి ఖాతాలో వెల్కం బోనస్ కింద రూ.10 వేలు జమచేశారు. ఆపై కొన్నిరోజులు కమీషన్ కూడా ఇచ్చారు. ఆపై పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ చేయించుకుని స్పందించడం మానేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

పూణెకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఫోన్ కు గతేడాది సెప్టెంబర్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఆన్ లైన్ లో పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ ఉందని, గ్రూప్ చాట్ లో చేరాలని అందులో సూచించారు. ఆ గ్రూప్ లో చేరిన తర్వాత వెల్కం బోనస్ కింద బాధితుడి ఖాతాలో రూ.10 వేలు జమ చేశారు. కార్పొరేట్ ట్రావెల్ మేనేజ్ మెంట్ (సీటీఎం) పేరుతో ట్రావెల్ ఏజెన్సీలకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తామని చెప్పారు. తొలుత టాస్క్స్ ఇవ్వడానికి రెండు వాయిదాలలో రూ.21,990 లు కట్టించుకున్నారు. టాస్క్ పూర్తిచేసిన తర్వాత కమిషన్ తో కలిపి రూ.24,809 లు బాధితుడి ఖాతాలో జమ చేశారు.

రెండో దఫాలో రూ.80 వేలు కట్టించుకుని, రూ.94,840 తిరిగిచ్చారు. ఆ తర్వాత రూ.1 లక్ష కడితే మంచి లాభాలు వస్తాయని చెప్పడంతో బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా పంపించాడు. అయితే, ఈ సారి మాత్రం మోసగాళ్లు నగదును తిరిగి జమ చేయలేదు. వారు చెప్పిన టాస్క్ పూర్తిచేసినా డబ్బులు రాకపోవడంతో ఫోన్ లో సంప్రదించగా.. ఈసారి రూ.35.25 లక్షలు కడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పారు. దీంతో బాధితుడు ఆ మొత్తాన్ని మోసగాళ్ల ఖాతాలో జమ చేశాడు.

రోజులు గడిచినా ఆ మొత్తం కూడా తిరిగివ్వక పోగా మరోమారు రూ.61.32 లక్షలు కడితే బాకీ మొత్తాన్ని భారీ లాభాలతో చెల్లిస్తామని చెప్పారు. అప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టిన బాధితుడు మరోమారు మోసగాళ్ల మాటలకు తలూపాడు. వారు అడిగిన మొత్తాన్ని పంపించాడు. వారు ఇచ్చిన టాస్క్ లు కూడా పూర్తి చేశాడు. అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో మరోమారు ఫోన్ చేయగా.. ఇంకొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని అడిగారు.

తన వద్ద డబ్బులేదని, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి తిరిగివ్వాలని బాధితుడు కోరడంతో ఫోన్ పెట్టేశారు. తిరిగి ఎన్నిమార్లు ప్రయత్నించినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దశలవారీగా మొత్తం రూ.96 లక్షలు కాజేశారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News