Ayyanna Patrudu: ఇలాంటి ద్రోహిని తరిమేస్తేనే బీసీలకు మేలు జరుగుతుంది: అయ్యన్నపాత్రుడు

  • టీడీపీ సాధికార సమితుల శిక్షణ కార్యక్రమం
  • కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు
  • బీసీలను రారాజులను చేసింది టీడీపీ, ఎన్టీఆరేనని వెల్లడి
Ayyanna Patrudu take a jibe at CM Jagan

బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి రారాజులను చేసింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారకరామారావేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ రెడ్డి ఎన్ని గిమ్మిక్కులు చేసినా తెలుగుదేశం నుండి బీసీలను దూరం చేయలేరని స్పష్టం చేశారు. 

ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన విశ్వబ్రాహ్మణ, నగరాలు, చాత్తాడ శ్రీవైష్ణవ, శిష్టకరణాలు సాధికార సమితుల శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయంగా సామాజికంగా గౌరవం లభించిందని వెల్లడించారు. "తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజే నాటిన మొక్కను నేను. అతి చిన్న వయసులోనే నన్ను ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలిపిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. నాడు బీసీలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ తీసుకున్న చొరవే నా ఉన్నతికి కారణం. 

బీసీలు బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా చదువుతోనే సాధ్యమని విద్యలో బీసీలకు ప్రోత్సాహం అందించారు. ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి బీసీలు చదువుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తాపత్రయపడింది, అండగా నిలిచింది. 

అలాంటి పరిస్థితుల నుండి నేడు ఏ రోజు ఎక్కడ ఎవరి మీద దాడి జరుగుతుందో తెలియని పరిస్థితిని జగన్ రెడ్డి సృష్టించారు. మన నిధులు కాజేస్తున్నాడు. ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు. రాజకీయ అవకాశాలు దూరం చేశాడు. ఇలాంటి బీసీ ద్రోహి జగన్ రెడ్డిని తరిమేస్తేనే బీసీలకు మేలు జరుగుతుంది" అంటూ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

More Telugu News