Telangana: కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్​ సుదర్శన యాగం

  • ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవం
  • ఉదయం 6 నుంచి సుదర్శన యాగం
  • మధ్యాహ్నం 1.58–2.04 గంటల మధ్య తమ చాంబర్లలో కొలువు తీరనున్న సీఎం, మంత్రులు
Telangana State new Secretariat ready for inaugaration

తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి చేస్తారు. ఆ వెంటనే కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి నేరుగా 6 వ అంతస్తులోని తన ఛాంబర్ లో కొలువు తీరనున్నారు.

మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో సుముహర్తం ఉండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరుతారు. ఈ ఆరు నిమిషాల సమయంలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని అధికారులకు, మంత్రులకు జీఏడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం  మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మరోవైపు నూతన సచివాలయంలో ఆయా శాఖలకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ చాంబర్లను కేటాయించింది. ఏ అంతస్తులో ఏ శాఖ ఉండాలో నిర్ణయించింది. ఒక్కో అంతస్తును మూడు, నాలుగు శాఖలను కేటాయించింది. ఆరో అంతస్తులో సీఎం, సీఎంఓ,సీఎస్ కార్యాలయం ఉండనుంది.

More Telugu News