బీజేపీపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన మంత్రి

Actress Ramya Sensational Comments On BJP
  • బీజేపీలోకి వస్తే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ వచ్చిందన్న రమ్య
  • దానిని అప్పుడే తిరస్కరించానన్న మాజీ ఎంపీ
  • సినిమా నటులు ప్రచారానికి వెళ్తే ఓట్లు వచ్చేయవని వ్యాఖ్య
బీజేపీపై కన్నడ నటి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని ఓ నాయకుడు ఆఫర్ ఇచ్చారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. అయితే, తాను ఆ ఆఫర్‌ను అప్పుడే తిరస్కరించినట్టు చెప్పారు. మాండ్యా మాజీ ఎంపీ అయిన రమ్య 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు. 

తాజాగా, రమ్య మాట్లాడుతూ.. తనకు బీజేపీపై వ్యతిరేకత లేదని అయితే, కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం తనకు గిట్టవని అన్నారు. సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తే నగదు పంచకుండానే ప్రజలు వచ్చేస్తారని కొందరు నేతలు అనుకుంటారని అన్నారు. నిజానికి సినిమా నటులు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఓట్లు రావని రమ్య స్పష్టం చేశారు.

ప్రముఖ నటుడు సుదీప్ బీజేపీకి ప్రచారం చేస్తుండడంపై రమ్య మాట్లాడుతూ.. బొమ్మైతో ఆయనకున్న వ్యక్తిగత అభిమానంతోనే ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రచారానికి రావాలంటూ ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా తాను నిరాకరించానని పేర్కొన్నారు. 

బీజేపీ ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు
బీజేపీలోకి వస్తే ఒక్క రోజులోనే మంత్రిని చేస్తానని బీజేపీ ఆఫర్ ఇచ్చిందన్న నటి రమ్య వ్యాఖ్యలపై మంత్రి అశోక్ తీవ్రంగా స్పందించారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించేంత స్థాయికి బీజేపీ దిగజారలేదన్నారు. ఆమె అవసరం బీజేపీకి లేనేలేదన్నారు. బీజేపీలోకి ఆమెను ఆహ్వానించిన నాయకుడు ఎవరో తెలియదని అశోక్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Atcress Ramya
Actress Divya Spandana
Karnataka
Congress
BJP

More Telugu News