బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ మీటింగ్... అందుకేనా?
- కొంతకాలంగా బాహుబలి-3పై వార్తలు
- ఏదైనా జరగొచ్చంటూ గతంలో ప్రభాస్ వ్యాఖ్యలు
- ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన బాహుబలి నిర్మాత
- ప్రస్తుతం రాజమౌళి చేతిలో పలు ప్రాజెక్టులు
- అవన్నీ పూర్తయ్యాకే బాహుబలి-3పై క్లారిటీ వచ్చే అవకాశం
తాజాగా బాహుబలి నిర్మాతలను ప్రభాస్ కలవడం ఈ ప్రచారానికి మరింత హైప్ తీసుకువస్తోంది. బాహుబలి-3పై చర్చించేందుకే ప్రభాస్ ఆ నిర్మాతలను కలిసి ఉంటాడని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో బాహుబలి సిరీస్ కొనసాగింపుపై ప్రభాస్ స్పందిస్తూ... తగిన సమయం వస్తే ఏదైనా జరగొచ్చని అభిమానుల్లో ఆశలు పెంచాడు. ఇప్పుడు ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడంతో ఆ కామెంట్స్ కు బలం చేకూరినట్టయింది.
ఇంతకుముందు, బాహుబలి నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బాహుబలి-3కి అవకాశం ఉందని, ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేదని అన్నారు. రాజమౌళి అనేక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడని, అవన్నీ అయిపోయాక అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు.
కాగా, బాహుబలి తొలి రెండు పార్టుల కంటే మూడో పార్టులో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న వార్తలు బయటికి వస్తున్నాయి. ఏదేమైనా, దీనిపై బాహుబలి టీమ్ అధికారిక ప్రకటన చేస్తేనే స్పష్టత వస్తుంది.